కోజికోడ్ (కేరళ): కన్నడ సూపర్హిట్ చిత్రం ‘కాంతారా’ సినిమా కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. కన్నడ సూపర్హిట్ చిత్రం ‘కాంతారా’ సినిమాలోని ఓ పాట కాపీ చేశారనే కేసుకు సంబంధించి దర్శకుడు, నిర్మాత రిషబ్ శెట్టిని కేరళ పోలీసులు విచారించారు. ఆదివారం కోజికోడ్ నగర పోలీసుల ఎదుట రిషబ్ శెట్టి హాజరై వాంగ్మూలమిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మాత విజయ్ కిర్గందూర్, నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కోజికోడ్ నగర పోలీసుల ఎదుట హాజరయ్యారు.
కోర్టు ఆదేశాల ప్రకారం రిషబ్ శెట్టి వాంగ్మూలాన్ని నమోదు చేశామని, అవసరమైతే ఆయన్ను మళ్లీ విచారణకు పిలుస్తామని కేరళ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. కాపీరైట్ ఉల్లంఘన కేసులో తుది ఉత్తర్వులు వెలువడే వరకు ‘వరాహరూపం’ పాటతో చిత్రాన్ని ప్రదర్శించవద్దని కన్నడ బ్లాక్బస్టర్ నిర్మాత, దర్శకులను ఆదేశిస్తూ కేరళ హైకోర్టు విధించిన షరతుపై ఫిబ్రవరి 10వతేదీన సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు షరతుల్లో ఒకదానిని సవరించిన ధర్మాసనం నిర్మాత కిర్గందూర్, దర్శకుడు శెట్టిని అరెస్టు చేస్తే వెంటనే బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది.
వరాహరూపం పాటను కాపీ కొట్టారంటూ కోజికోడ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో దర్శకుడు, నిర్మాతలకు ఫిబ్రవరి 8న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.విచారణ కోసం ఫిబ్రవరి 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య విచారణ అధికారి ముందు హాజరు కావాలని కిర్గందూర్, శెట్టిలను కోర్టు కోరింది.నిందితులు సాక్షులను బెదిరించరాదని లేదా సాక్ష్యాలను తారుమారు చేయరాదని, వారు విచారణకు సహకరిస్తారని, విచారణకు అందుబాటులో ఉంటారని పేర్కొంది. న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా నిందితులు,పిటిషనర్లు దేశం విడిచి వెళ్లరాదని కూడా పేర్కొంది.