ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ని కలిసి కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలి. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. బీఎల్వోలుగా 2600 మంది మహిళా పోలీసులను పెట్టారు. మాపై, జనసేనపై 6 వేల నుంచి 7 వేల కేసులు అక్రమంగా పెట్టారు. ఒక్క పుంగనూరు కేసులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలను సీఈసీకి చెప్పాం అన్నారు చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఈసీ చెప్పిందన్న ఆయన.. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలి.. స్పెషల్ సెల్ పెట్టాలని కోరారు. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ చేస్తాం. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పని చేస్తాం అన్నారు చంద్రబాబు.. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చింది.. అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన తర్వాత అధికార వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు.