1990 ప్రాంతంలో నటిగా వెలుగొందిన నిషాంతి అలియాస్ శాంతిప్రియ ఇపుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. ఆమె సీనియర్ నటి భానుప్రియ చెల్లెలు. తెలుగులో 1988లో వచ్చిన ‘మహర్షి’ చిత్రంతోనూ, అదే సంవత్సరం వచ్చిన ‘ఎంగ ఊరు పాట్టుక్కారన్’ తమిళ చిత్రంతోనూ ఆమె టాలీవుడ్, కోలీవుడ్లో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా ‘రయిలుక్కు నేరమాచ్చు’ (1988), ‘సిగప్పు తాళి’ (1988) వంటి అనేక తమిళ చిత్రాల్లో నటించిన శాంతిప్రియ 1990 కాలంలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనూ ఆమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించే నిమిత్తం ఆమె సినిమాలకు దూరమైంది. ఇపుడు మళ్ళీ ఓ వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.
ఎంఎక్స్ ప్లేయర్ రూపొందించిన గ్యాంగ్స్టర్ డ్రామా ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్లో ఆమె నటించింది. ఇందులో సునీల్ శెట్టి సోదరిగా ‘బోనమ్మ’ అనే పాత్రలో పోషించింది. అలాగే, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ‘సరోజిని నాయుడు – ది అన్సంగ్ ఫ్రీడం ఫైటర్’లో కూడా శాంతిప్రియ నటిస్తున్నారు. వీటితోపాటు తమిళం, తెలుగు భాషల్లో నటించే విషయమై సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.