న్యూఢిల్లీ: భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అదానీ గ్రూప్ వ్యాపార అభివృద్ధి నేపథ్యంలో గౌతమ్ అదానీ ఓ ఆంగ్ల టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. తన వ్యాపార సామ్రాజ్యం మూడు దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైందని అదానీ చెప్పారు. తన వ్యాపార సామ్రాజ్యం వృద్ధిని ఏ ఒక్క రాజకీయ నాయకుడితోనూ ముడిపెట్టలేమని, ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న సంబంధాల వల్ల లబ్ధి పొందాననే ఆరోపణలను అదానీ తోసిపుచ్చారు.‘‘ప్రధాని మోదీ, నేను ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లం. కొందరు నిరాధారమైన ఆరోపణలకు నన్ను సులభంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు నాపై చేయడం దురదృష్టకరం’’ అని అదానీ వ్యాఖ్యానించారు.
తన వ్యాపార విజయం ఏ ఒక్క నాయకుడి వల్ల కాదని, పలువురు నాయకులు, ప్రభుత్వాలు ప్రారంభించిన విధానాలు, సంస్థాగత సంస్కరణల కారణంగా సాధించానని అదానీ స్పష్టం చేశారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగుమతి, దిగుమతి విధానాన్ని సరళీకరించినపుడు తన వ్యాపారం విజయం సాధించిందని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు.‘‘1991వ సంవత్సరంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు భారీ ఆర్థిక సంస్కరణలను ప్రారంభించినప్పుడు నాకు రెండవ ఫుష్ లభించింది…దీనివల్ల ఇతర పారిశ్రామికవేత్తలలాగా నేను ఆ సంస్కరణల వల్ల లబ్ధి పొందాను’’ అని అదానీ వివరించారు.
తన కెరీర్లో మూడవ మలుపుగా 1995వ సంవత్సరంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీకి చెందిన కేశుభాయ్ పటేల్ ఎన్నిక కావడం, ముంద్రాలో తన మొదటి ఓడరేవును నిర్మించడానికి దారితీసిన తీరప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం’’ అని చెప్పారు.2001వ సంవత్సరంలో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ హయాంలో గుజరాత్ అభివృద్ధిపై దృష్టి పెట్టారని, దీంతో నాటి మోదీ విధానాలు గుజరాత్ రాష్ట్ర ఆర్థికరంగాన్ని మార్చేశాయని అదానీ చెప్పారు.
ధీరూభాయ్ అంబానీతో స్ఫూర్తి పొందా…
తాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ నుంచి స్ఫూర్తి పొందానని అదానీ చెప్పారు.తన వ్యాపారాలన్నీ సమర్థులైన సీఈఓలు నిర్వహిస్తుంటారని, వారి రోజువారీ పనితీరులో తాను జోక్యం చేసుకోనని అదానీ వివరించారు.