రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించి, వారికి గుర్తింపు (ఐడీ) కార్డులు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు కేసీఆర్కు లేఖ రాశారు. లేఖలోని వివరాలను గురువారం ఆయన మీడియాకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కమ్యూనిటీ పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిక్షణ ఇప్పించారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అయితే, అప్పట్లో వివిధ కారణాలతో పాటు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుండడంతో పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లను ఇవ్వలేదని వివరించారు.
2014 ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం వస్తే పారామెడికల్ సిబ్బందికి సర్టిఫికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం ప్రస్తావించారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చి ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ హామీ అమలు అతీగతి లేదని తెలిపారు. అవసరమైతే ఆర్ఎంపీ, పీఎంపీలకు మరోసారి శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. గ్రామాల్లో ఇప్పటికీ ఆర్ఎంపీ, పీఎంపీల సేవలు అవసరమేనన్నారు. అత్యవసర సమయాల్లో ఇప్పటికీ ఆర్ఎంపీ, పీఎంపీలే ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు సైతం అత్యవసర సమయాల్లో వైద్య సాయం అందించేందుకు వీరు ఉపయోగపడతారన్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు ప్రాథమికంగా ఆర్ఎంపీ, పీఎంపీల సేవలు పనికొస్తాయని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను ఆర్ఎంపీ, పీఎంపీల అంశాన్ని ప్రస్తావించగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.