భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లిలో ఉన్న భారతిదాసన్ యూనివర్సిటీకి చేరుకున్నారు. దీంతో ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
1982లో ప్రస్తుతం ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలలను భారతీదాసన్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని మోదీ అన్నారు. ఇది పరిణతి చెందిన పునాదిపై ప్రారంభమైందని.. మానవత్వం, భాష, సైన్స్ వంటి అనేక రంగాలలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రధానమైనదిగా చేసినట్లు చెప్పారు. మన దేశం, నాగరికత ఎల్లప్పుడూ జ్ఞానంపై దృష్టి సారించిందని ప్రధాని గుర్తు చేశారు. అంతేకాదు గతంలో నలంద, తక్షశిల వంటి మన ప్రాచీన విశ్వవిద్యాలయాల గురించి కూడా ప్రస్తావించారు. దీంతోపాటు కాంచీపురం, గంగైకొండ, చోళపురం, మదురై ప్రాంతాలు అప్పట్లో గొప్ప విద్యా కేంద్రాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడకి వచ్చి విద్యనభ్యసించే వారని వెల్లడించారు.
యువత అంటే శక్తి అని దాని అర్థం వేగం, నైపుణ్యంతో పని చేయాలని మోదీ సూచించారు. గత 10 సంవత్సరాలలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి దాదాపు 150కి రెట్టింపు అయ్యిందన్నారు. తమిళనాడు ఒక శక్తివంతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉందన్నారు. దీంతోపాటు ప్రధాన ఓడరేవుల మొత్తం కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం 2014 నుంచి రెండింతలు పెరిగిందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో మోదీ రూ.19,850 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు.