న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు దేశానికి పెద్ద భారంగా మారాయి. అక్టోబరుతో ముగిసిన 2021-22 ఆయిల్ ఇయర్లో వంట నూనెల దిగుమతి భారం రూ.1.57 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 34.18ు ఎక్కువ. ఇదే సమయంలో దిగుమతి చేసుకునే వంట నూనెల పరిమాణమూ 6.85ు పెరిగి 140.3 లక్షల టన్నులకు చేరింది. దేశంలోని వంట నూనెల పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఈ వివరాలు వెల్లడించింది.
మళ్లీ పైపైకి: సెప్టెంబరు త్రైమాసికంలో దిగుమతుల జోరు కొద్దిగా తగ్గినా.. అక్టోబరు నుంచి దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. పామాయిల్ ఎగుమతులపై నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేయడం.. పర్యవసానంగా ధర తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2020-21 ఆయిల్ ఇయర్తో పోలిస్తే 2021-22లో సన్ఫ్లవర్ నూనె దిగుమతులు స్వల్పంగానే పెరిగాయి. అయితే ఇదే సమయంలో సోయా నూనె దిగుమతులు మాత్రం 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులకు పెరిగాయి. ఇండోనేషియా నిషేధంతో పామాయిల్ దిగుమతులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఎస్ఈఏ తెలిపింది.